Search
Close this search box.

తగ్గుతున్న బంగారం ధరలు

బడ్జెట్‌ తరవాత ఐదువేల వరకు తగ్గింపు

కొనుగోళ్లు పెరిగాయంటున్న వ్యాపారులు

దేశీయంగా బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టడంతో కొనుగోళ్లు కూడా పెరుగుతున్నాయి. కస్టమ్స్‌ డ్యూటీ తగ్గింపు తర్వాత ఆభరణాల కొనుగోలుకు ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగింది. దీపావళి, దంతేరస్‌ వంటి పండగలు, వివాహాది శుభకార్యాలు ముందుండడంతో ఆభరణాల కొనుగోలుకు డిమాండ్‌ పెరిగినట్లు వర్తకులు చెబుతున్నారు. సాధారణ రోజులతో పోలిస్తే సుమారు 20 శాతం మేర డిమాండ్‌ పెరిగినట్లు పేర్కొంటున్నారు. నగల గురించి ఆరా తీసే వారి సంఖ్య కూడా పెరిగిందంటున్నారు. దీంతో కొన్ని సంస్థలు ఆభరణాల తయారీదారుల సెలవులు కూడా రద్దు చేసినట్లు తెలుస్తోంది. ఎప్పటినుంచో బంగారం కొనాలనుకుంటున్నవారంతా ఇప్పుడు తమ కలను సాకారం చేసుకుంటున్నారని వర్తకులు చెబుతున్నారు. అయితే, ఒకేసారి డిమాండ్‌ పెరిగితే ప్రభుత్వం ఎక్కడ మళ్లీ సుంకాన్ని పెంచుతుందోనన్న భయాలూ కొందరు వర్తకుల్లో నెలకొనడం గమనార్హం. బడ్జెట్‌ తర్వాత స్థానిక మార్కెట్‌లో 10 గ్రాముల పసిడి ధర దాదాపు రూ.5 వేల మేర దిగొచ్చింది. కస్టమ్స్‌ సుంకాన్ని భారీగా తగ్గించడమే దీనికి ప్రధాన కారణం. దీంతో నగల దుకాణాల్లో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. మరికొన్ని రోజుల్లో పండగల సీజన్‌ ప్రారంభం కానున్నవేళ బంగారాన్ని కొనుగోలు చేసేందుకు జనం పోటీపడుతున్నారు. బంగారం ధర భారీగా తగ్గిన నేపథ్యంలో బంగారంలో పెట్టుబడులు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. బంగారంపై కస్టమ్స్‌ డ్యూటీని 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించడంతో దిగుమతి భారం 

తగ్గింది. పసిడి అక్రమరవాణాను అరికట్టేందుకు సుంకం తగ్గించాలన్న డిమాండ్‌ ఎప్పటినుంచో ఉంది. ఈ నేపథ్యంలో సుంకాన్ని తగ్గించడంతో సుమారు కిలోకు రూ.3.90 లక్షల వరకు ధర తగ్గడం గమనార్హం. బ్జడెట్‌ తర్వాత 10 గ్రాముల బంగారం విూద రూ.5 వేలు మేర తగ్గింది. అటు వెండి కిలోకు రూ.7 వేల వరకు తగ్గి ప్రస్తుతం రూ.84 వేలు పలుకుతోంది. ధర తగ్గడం వల్ల రిటైల్‌ ఇన్వెస్టర్ల నుంచి బంగారంపై పెట్టుబడులు పెరిగే అవకాశం ఉందని నిపుణులు పేర్కొన్నారు. భౌతిక బంగారంగానే కాకుండా.. పెట్టుబడి సాధనంగానూ బంగారాన్ని పరిశీలించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణాన్ని, కరెన్సీ విలువ పతనాన్ని తట్టుకొని నిలబడగలిగే శక్తి పసిడికి ఉండడమే దీనికి కారణమని చెప్పారు. ఈ నిర్ణయం వల్ల స్మగ్లింగ్‌ మాఫియాకు అడ్డుకట్ట వేయడంతో పాటు వ్యవస్థీకృత మార్కెట్‌ ద్వారా ప్రభుత్వానికి జీఎస్టీ, ఆదాయపు పన్ను రూపంలో రెవెన్యూ సమకూరుతుందని నిపుణులు చెబుతున్నారు. బంగారం ధరలో స్థిరత్వం అనేది అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల నిర్ణయం, వివిధ దేశాల ఆర్థిక, భౌగోళిక రాజకీయ పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

శ్రీ రామ నవమి రోజున రాముల వారి సాక్షిగా ఓ బీసీ బిడ్డకు అవమానం
IMG-20250408-WA0434
పరామర్శించిన కేటీఆర్ సేన అధ్యక్షుడు
Oplus_131072
ఏసీబీ వలలో చింతలపాలెం ఎస్సై
కాటమయ్య రక్షణ కవచం అందరూ వినియోగించా కల్లుగీత కార్మిక
IMG-20250405-WA0368
ఐనవోలు మండల కేంద్రంలో ఘనంగా బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి