ప్రతి కుటుంబానికి అందజేసే డిజిటల్ కార్డుపైన ఆ ఇంటి మహిళనే యజమానిగా గుర్తించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సూచించారు. కుటుంబంలోని సభ్యుల పేర్లు, ఇతర వివరాలను కార్డు వెనుక భాగంలో ఉండే విధంగా కార్డుల రూపకల్పన జరగాలని చెప్పారు.
🔹 ఫ్యామిలీ డిజిటల్ కార్డుల (FDC) రూపకల్పనపై ముఖ్యమంత్రి గారు సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించారు.
🔹 సీఎం గారి ఆదేశాల మేరకు అధికారులు ఈ నెల 25 నుంచి 27 వరకు రాజస్థాన్, హర్యానా, కర్ణాటక, మహారాష్ట్రల్లో డిజిటల్ కార్డుల అమలుపై చేసిన అధ్యయన వివరాలను సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
🔹 ఈ సందర్భంగా సీఎం గారు రాష్ట్రంలో జారీ చేసే డిజిటల్ కార్డుల విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలను అధికారులకు వివరించారు.
🔹 ప్రస్తుత రేషన్, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఐటీ, వ్యవసాయ, ఇతర సంక్షేమ పథకాల్లోని డాటా ఆధారంగా కుటుంబాలను నిర్ధారించాలి. బ్యాంకు ఖాతాలు, పాన్ కార్డుల వివరాలు అవసరం లేదు.
🔹 రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కోచోట ఒక గ్రామీణ, ఒక పట్టణ ప్రాంతాన్ని ఎంపిక చేసి పైలెట్ ప్రాజెక్టుగా దీన్ని చేపట్టాలి.
🔹 ఫ్యామిలీ డిజిటల్ కార్డుల్లో ఏ ఏ అంశాలను పొందుపరచాలన్న వివరాలను నివేదిక రూపంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గార్లతో కూడిన మంత్రివర్గ ఉపసంఘానికి అందించాలి.
🔹 మంత్రివర్గ ఉప సంఘం సూచనలకు అనుగుణంగా సమగ్ర వివరాలతో నివేదిక రూపొందించాలి.
🔹 అక్టోబర్ 3 వ తేదీ నుంచి పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఎలాంటి లోపాలు లేకుండా క్షేత్రస్థాయి (డోర్ టు డోర్) పరిశీలన పూర్తి చేయాలి.
🔹 సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దామోదర రాజనర్సింహ గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గారు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.